
హైదరాబాద్ (సూర్య న్యూస్): హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ – ఫేజ్-2’లో భాగంగా ఆటో, క్యాబ్, ట్యాంకర్ డ్రైవర్ల కోసం ఐ షీల్డింగ్ క్యాంపులు మరియు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ సెషన్లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ CP (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ సమయంలో డిఫెన్సివ్ పద్ధతులను పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించడం, సీట్ బెల్ట్స్ ధరించడం మరియు ఎల్లప్పుడూ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆయన డ్రైవర్లను కోరారు.

DCP ట్రాఫిక్-II కాజల్ సింగ్ మాట్లాడుతూ డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు వాడకూడదని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు, పిలియన్ రైడర్లు ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. విన్ విజన్ ఐ హాస్పిటల్ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్య నిపుణుల బృందం డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారా రోడ్డు భద్రతను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.