Skip to content
Home » టీ20 వరల్డ్ కప్: జింబాబ్వేపై భారత్ ఘనవిజయం, సెమీస్ ఆశలు సజీవం

టీ20 వరల్డ్ కప్: జింబాబ్వేపై భారత్ ఘనవిజయం, సెమీస్ ఆశలు సజీవం

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశలో భాగంగా జరిగిన కీలక పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన మస్ట్ విన్ మ్యాచ్ లో టీమ్ ఇండియా 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ తన సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇది ఈ టోర్నమెంట్ లోనే అత్యధిక స్కోరు కావడం విశేషం. అనంతరం 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బ్యాటర్ల వీరవిహారం: భారీ స్కోరు సాధించిన భారత్​

టాస్ గెలిచిన జింబాబ్వే భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు అర్ధ సెంచరీతో ఫామ్ లోకి రాగా, ఇషాన్ కిషన్ 38 పరుగులు మరియు సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులతో వేగంగా ఆడారు. చివర్లో హార్దిక్ పాండ్యా తన పవర్ హిట్టింగ్ తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన హార్దిక్, భారత స్కోరును 250 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. సంజు సామ్సన్ మరియు టిలక్ వర్మ కూడా విలువైన సహకారాన్ని అందించారు.

పోరాడిన బెనెట్: కట్టడి చేసిన భారత బౌలర్లు

​భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెనెట్ ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. సికందర్ రజా వంటి కీలక ప్లేయర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి జింబాబ్వే వెన్ను విరిచాడు. హార్దిక్ పాండ్యా మరియు అక్సర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ తన తదుపరి మ్యాచ్ లో మార్చి 1న కోల్‌కతా వేదికగా వెస్ట్ ఇండీస్ తో తలపడనుంది.​Surya News Labels:

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *