
శేరిలింగంపల్లి: నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే తన ధ్యేయమని పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ మసీదుబండలోని కుడికుంట చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులు పూర్తి కావడంతో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై చెరువును ప్రారంభించారు. ఈ సుందరీకరణ పనులు సాహే (SAHE – Society for Advancement of Human Endeavour) అనే ఎన్జీవో సంస్థ ప్రతినిధి కల్పన రమేష్ ఆధ్వర్యంలో జరిగాయి. ఇన్ఫోసిస్ (Infosys) ఐటీ సంస్థ తమ సామాజిక బాధ్యత (CSR) నిధుల సౌజన్యంతో ఈ అభివృద్ధి పనులకు సహకారం అందించింది.

ఈ సందర్భంగా అరెకపూడి గాంధీ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని 64 చెరువులను దశలవారీగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కుడికుంట చెరువుపై నిర్మించిన వాకింగ్ ట్రాక్ స్థానిక కాలనీవాసులకు, వృద్ధులకు మరియు చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, వీటిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే సంస్థలు అభినందనీయమని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎన్జీవో ప్రతినిధులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.