
నిజాంపేట్, ఫిబ్రవరి 27 (సూర్య న్యూస్):నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్ నివాసులు తమ ప్రాంతంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి (కెస్సార్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో మౌలిక సదుపాయాల లేమి వల్ల నివాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా రోడ్ల దుస్థితి, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, నీటి సరఫరాలో ఎదురవుతున్న అంతరాయాలపై నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సేవలలో జరుగుతున్న ఆలస్యం వల్ల రోజువారీ జీవితం కష్టతరంగా మారుతోందని వారు కెస్సార్ దృష్టికి తీసుకెళ్లారు.
నివాసుల సమస్యలను ఓపికగా విన్న కొలన్ శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాలనీ సమస్యలను త్వరలోనే మున్సిపల్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం తగిన ఒత్తిడి తీసుకువస్తానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా త్వరితగతిన పనులు జరిగేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి శంకర్, కురమయ్య, బి రవి, కృష్ణ గౌడ్, ధర్మ రావు, వెంకటేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన సౌకర్యాల సాధన కోసం అంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.