Skip to content
Home » హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్: ఆ 1310 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి?

హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్: ఆ 1310 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి?

కూకట్‌పల్లి సున్నం చెరువు భూముల విషయంలో ఘాటు వ్యాఖ్యలు

కూకట్‌పల్లి: సున్నం చెరువు భూముల విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన వివరణపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. హైడ్రా కమిషనర్ ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని ఆయన సూచించారు. ముఖ్యంగా కూకట్‌పల్లిలో 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు చేసిన ప్రకటనపై ఎమ్మెల్యే ఘాటుగా మండిపడ్డారు. ఆ భూమి ఎక్కడ ఉందో స్పష్టంగా బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రికార్డుల్లో స్పష్టంగా ప్రభుత్వ భూమే :

సున్నం చెరువులోని సర్వే నంబర్లు 29, 30లోని భూమి ప్రభుత్వ భూమేనని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. గతంలో ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖలు కలిసి అక్కడ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. అయితే హైడ్రా వదిలేసిన మిగిలిన భూమిని కూడా వెంటనే టేకప్ చేసి ఫెన్సింగ్ వేయాలని, లేకపోతే ప్రజల్లో అనుమానాలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ భూమిని పార్కుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని, లేకపోతే కబ్జాలకు అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కబ్జాలను సహించబోను

నియోజకవర్గ అభివృద్ధికి తాము ఎప్పుడూ సహకరిస్తామని, అయితే కబ్జాలను మాత్రం సహించబోనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఆ భూమిపై అగ్రిమెంట్లు చేసుకున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల భూములను కూకట్‌పల్లికి ముడిపెట్టవద్దని కమిషనర్‌కు సూచించారు. గతంలో ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పాఠశాలలు నిర్మించినట్లు, వేల కోట్ల విలువైన భూములు కాపాడినా ఎప్పుడూ ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై హైడ్రా కమిషనర్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు.

సూర్య న్యూస్ గమనిక: ఈ కథనం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందన ఆధారంగా రాయబడింది. హైడ్రా కమిషనర్ నుంచి స్పందన వస్తే తప్పనిసరిగా ప్రచురిస్తాం.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *