Skip to content
Home » తెలంగాణలో ఫీజుల నియంత్రణకు భారీ కసరత్తు: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

తెలంగాణలో ఫీజుల నియంత్రణకు భారీ కసరత్తు: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

హైదరాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (CS) నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యాశాఖపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.​

ఫీజులు అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు​

ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తే వాటి అనుమతులను రద్దు చేయడంతో పాటు, అదనంగా వసూలు చేసిన సొమ్మును రికవరీ చేసేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన కమిటీ సిఫార్సులను వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.​

మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు​

వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున పైలట్ ప్రాజెక్టు కింద మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల పాఠశాల తరహాలోనే ఈ స్కూళ్లలో అన్ని వసతులు, క్రీడా మైదానాలు మరియు రవాణా సౌకర్యాలు ఉండేలా చూడాలని సీఎం నిర్దేశించారు. అలాగే క్యూఆర్ (Qur) పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.​

విద్యార్థులకు ఉచిత కిట్లు మరియు అల్పాహారం​

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరికొత్త పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది:

​బ్రేక్ ఫాస్ట్ మరియు పాలు: 1 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు అందజేయాలని సీఎం ఆదేశించారు. దీనికోసం విజయ డెయిరీ నుంచి పాలను సేకరించాలని సూచించారు.​

స్టూడెంట్ కిట్స్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, స్టేషనరీ (పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్), డిక్షనరీ మరియు బూట్లతో కూడిన పూర్తి స్థాయి కిట్లను అందించనున్నారు.​

రవాణా: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ బస్సులను ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.​

పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధ (AI) బోధన

​మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధ (AI) బోధనను ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారు. ఉపాధ్యాయులకు మరియు అధ్యాపకులకు ఈ విషయంలో స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఉపాధి అవకాశాలను మన విద్యార్థులు అందుకునేలా సిద్ధం చేయాలని ఆదేశించారు.​

ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి ‘తెలంగాణ విద్యా విధానం-2026’ నివేదికను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *