
హైదరాబాద్ (సూర్య న్యూస్): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) దేశంలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. భౌగోళిక గుర్తింపు (GI) పొందిన తెలంగాణ విశిష్ట కళలు, హస్తకళల చిత్రాలతో రూపొందించిన “GI ఆన్ వీల్స్” బస్సులను శుక్రవారం ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ వినూత్న ప్రయోగం దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం.

తెలంగాణ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ కళలు మరియు చేతిపనులపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ బస్సులను తీర్చిదిద్దారు. పోచంపల్లి ఇక్కత్, చేర్యాల నకాషీ వంటి జీఐ గుర్తింపు పొందిన కళాకృతులతో బస్సులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఈ విధానం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, గ్రామీణ చేతివృత్తుల కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాలకు ఆరు ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మరియు పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.