హర్యానా ప్రభుత్వ నిధుల దారిమళ్లింపు కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

చండీగఢ్, సూర్య న్యూస్ : దేశ బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపుతున్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 590 కోట్ల రూపాయల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం భారీ దాడులు నిర్వహించారు, హర్యానా ప్రభుత్వ ఖాతాల నుంచి దారిమళ్లిన నిధుల వ్యవహారంలో చండీగఢ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో ఈడీ సిబ్బంది ఏకకాలంలో సోదాలు చేపట్టారు, ప్రభుత్వ నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో స్వాహా చేసిన ఈ భారీ ఆర్థిక మోసం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను మరోసారి బట్టబయలు చేసింది.
చండీగఢ్లోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్లో హర్యానా స్కూల్ శిక్షా పరియోజనా పరిషద్ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు డిపాజిట్ చేసిన నిధులను బ్యాంక్ ఉద్యోగులు మరియు మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు కలిసి నకిలీ ఎఫ్డీలు సృష్టించి దారిమళ్లించారు, ఈ నిధులను షెల్ కంపెనీలు మరియు చిన్న జ్యువెలరీ సంస్థల ద్వారా మళ్లించి బంగారం కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు వినియోగించారు, హవాలా తరహాలో అకమోడేషన్ ఎంట్రీలను ఉపయోగించి ఈ మనీ ట్రయల్ను దాచిపెట్టే ప్రయత్నం చేశారు.

ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు మాజీ బ్యాంక్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు వ్యాపార సంస్థల కార్యాలయాలపై దృష్టి సారించారు, ఇప్పటికే హర్యానా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా బ్యాంక్ అంతర్గత ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి 645 కోట్ల రూపాయల క్లెయిమ్లను సెటిల్ చేసింది, ఫిబ్రవరి 22వ తేదీన ఈ మోసాన్ని గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం ఇది కేవలం ఒక బ్రాంచ్కు పరిమితమైన సమస్యగా పేర్కొన్నప్పటికీ ఈడీ దర్యాప్తుతో మరిన్ని అరెస్టులు మరియు ఆస్తుల రికవరీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.