
హైదరాబాద్, సూర్య న్యూస్ : కారుణ్య నియామకాల (Compassionate Appointments) విషయంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక నిర్ణయం తీసుకుంది. రివ్యూ పిటిషన్ వేసిన హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు (HMWSSB) కు కోర్టులో భారీ చుక్కెదురైంది. కారుణ్య నియామకానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.
తల్లి మరణించడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని హైదరాబాద్ కు చెందిన పి. కవిత అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు, ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని నియామకంపై నిర్ణయం తీసుకోవాలని 2025 లో తీర్పు వెలువరించింది. అయితే జలమండలి (Water Board) ఈ తీర్పును అమలు చేయకుండా పునః సమీక్ష కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
దీంతో పాటు పాత కారణాలతోనే తనకు ఉద్యోగం నిరాకరించడంపై బాధితురాలు కవిత కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. రికార్డుల్లో స్పష్టమైన తప్పు ఉన్నప్పుడు మాత్రమే రివ్యూ పిటిషన్ వేయాలని స్పష్టం చేశారు. రివ్యూ అనేది అప్పీలుకు ప్రత్యామ్నాయం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కొత్త అంశాలు లేకుండా వేసిన జలమండలి పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
పిటిషనర్ అభ్యర్థనను మరోసారి పరిశీలించి కారుణ్య నియామకానికి సంబంధించి నాలుగు వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని జలమండలి అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణను మూసివేస్తూ తీర్పునిచ్చింది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




