
హైదరాబాద్, సూర్య న్యూస్: కృత్రిమ మేధస్సు (AI Technology) విద్యా రంగంలో పెను మార్పులు తీసుకువస్తోందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు 15 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది.
త్వరలోనే డిజిటల్ వర్సిటీగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, తరగతి గది బోధనలో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఉపాధ్యాయులకు తగిన నైపుణ్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అతి త్వరలోనే పూర్తిస్థాయి డిజిటల్ వర్సిటీగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర విద్యా రంగం మౌలిక వసతులతో వేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.
అన్ని పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్స్.. హెచ్ఎంలకు ప్రత్యేక ట్రైనింగ్
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో త్వరలోనే ఐసీటీ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పాఠశాల నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక పరిపాలనా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వర్క్ బుక్స్ అందిస్తున్నామని, ప్రైవేటుకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్స్ పంపిణీ చేస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్ప చక్రపాణి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ్ కృష్ణారెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుష్మనా రావులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 1509 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



