
ఫతేపూర్, సూర్య న్యూస్ : మొబైల్ నెట్వర్క్ (Mobile Network) సరిగా రావడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు ఓ టెలికాం సంస్థ ఉద్యోగిని ఏకంగా సెల్ టవర్కే కట్టేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో చోటుచేసుకుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
యూపీలోని ఫతేపూర్ జిల్లా హర్దౌలీ గ్రామంలో చాలా రోజులుగా జియో నెట్వర్క్ సరిగా పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేక ఫోన్లు మాట్లాడుకోవడానికి, ఇంటర్నెట్ వాడుకోవడానికి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆ సంస్థ ప్రతినిధులు కనీసం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే నెట్వర్క్ సమస్యను పరిశీలించేందుకు ఓ ఉద్యోగి గ్రామానికి వచ్చాడు. అతడిని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. తమ నెట్వర్క్ సమస్యను పూర్తిగా పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి వదిలిపెట్టేది లేదని పట్టుబట్టారు. ఆగ్రహంతో అతడిని నేరుగా తీసుకెళ్లి అక్కడే ఉన్న టవర్కు తాళ్లతో కట్టేశారు.
ఉద్యోగిని టవర్కు కట్టేసిన వీడియోను కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా క్షణాల్లో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్ళింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హర్దౌలీ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



