
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి చెందిన రైతులు విద్యుత్ కోతలపై నిరసనకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసిన వీడియోను పంచుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు.
శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి చేరుకున్న రైతులు, విద్యుత్ కష్టాలతో తమ పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ పాట పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదన్న మాటలు నిజమవుతున్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత ఊరిలోనే రైతులు కరెంట్ కోసం ఇంత ఆవేదన చెందుతుంటే, ఇక రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా?
ఈ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేసిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకువచ్చిన మార్పు ఇదేనా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రోజులో తక్కువ గంటలే కరెంట్ వస్తుండటంతో బోరు బావుల కింద సాగు చేస్తున్న పంటలకు నీరు అందక తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. కరెంట్ కోతలపై రైతుల నిరసనలు పెరుగుతుండటంతో విద్యుత్ సరఫరా అంశంపై అటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



