
కూకట్పల్లి, సూర్య న్యూస్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా కూకట్పల్లి విభాగ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కూకట్పల్లి ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్య ధోరణి వీడాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న 9,500 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ఇంజనీరింగ్ మరియు ఫార్మా కళాశాలల్లో ఫీజులను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు. విద్యా కమిషన్ నివేదికను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ నగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రిషి, పూజిత్, గోపాల్, రాఘవేంద్ర, తరుణ్ మరియు నగర కార్యదర్శులు ధనుంజయ్, ఆకాష్, రఘు, నిహాల్, అవినాష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.