
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ తల్వార్ను తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఒక సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారు.
మార్చి 14న మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా గౌడ ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఒక సినిమా షూటింగ్ లో ఉన్న సుమన్ తల్వార్ ను కలిసి శ్రీకాంత్ గౌడ్ ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేసి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తదితర దక్షిణ భారత భాషల్లో సుమారు 700లకు పైగా చిత్రాల్లో నటించి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సుమన్ ప్రేక్షకుల మన్ననలు పొందారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆయన సినిమాలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
గౌడ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులను ఘనంగా సత్కరించనున్నారు. సమాజంలో ఐక్యత, అభివృద్ధి మరియు విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నటుడు సుమన్ హాజరై తన సందేశం ద్వారా గౌడ సమాజ విద్యార్థులలో, యువతలో మరింత ఉత్సాహాన్ని నింపి వారికి దిశానిర్దేశం చేస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.