
జామ్నగర్, సూర్య న్యూస్: రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (Reliance Executive Director) అనంత్ అంబానీ (Anant Ambani) తన 31వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం జామ్నగర్లో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. కేవలం వినోదానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యత, ప్రకృతి సంరక్షణ కలయికతో ఈ వేడుకలు సాగడం విశేషం. ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణ (Wildlife Conservation), వెటర్నరీ సైన్సెస్లో పరిశోధనల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ వర్సిటీగా పిలువబడే ‘వంతార యూనివర్సిటీ’ (Vantara University) కి అనంత్ అంబానీ శంకుస్థాపన చేశారు.
జ్ఞానానికి చిహ్నంగా ఒక పెద్ద పుస్తకం ఆకారంలో ఉన్న కేక్ను భార్య రాధికా మెర్చంట్ (Radhika Merchant), తండ్రి ముకేష్ అంబానీ (Mukesh Ambani) తో కలిసి ఆయన కట్ చేశారు. ఈ కేక్ పై “నేచర్ మీట్స్ నాలెడ్జ్” (Nature Meets Knowledge) అనే నినాదంతో వన్యప్రాణుల రక్షణ సందేశాలను పొందుపరిచారు. ఈ వేడుకలో బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్ (Ranveer Singh), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), వరుణ్ ధావన్ (Varun Dhawan) తదితరులు పాల్గొని సందడి చేశారు.
తన 31వ పుట్టినరోజు సందర్భంగా అనంత్ అంబానీ భారీ విరాళాలను ప్రకటించారు. మొత్తం 31 కీలక సేవా కార్యక్రమాల ద్వారా సుమారు 57 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందులో భాగంగా ద్వారకలో యాత్రికుల కోసం రూ. 30 కోట్లతో గెస్ట్ హౌస్ (Guest House), సాలంగ్పూర్ హనుమాన్ ఆలయంలో రూ. 10 కోట్లతో గోశాల నిర్మాణానికి నిధులు కేటాయించారు. సోమనాథ్, అంబాజీ ఆలయాల పరిధిలో విద్య, ఆరోగ్య పథకాలకు కూడా ఆయన మద్దతు ప్రకటించారు. వంతార అనిమల్ రెస్క్యూ సెంటర్ (Vantara Animal Rescue Center) కేంద్రంగా జరిగిన ఈ వేడుకలు అనంత్ అంబానీ ప్రకృతి ప్రేమిని మరోసారి చాటిచెప్పాయి.