
అమరావతి, సూర్య న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్-2025’ గెజిట్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఉద్యోగ విధానాన్ని ఖరారు చేసింది. దీని ద్వారా ఇకపై రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు మరియు బదిలీలు జరగనున్నాయి. ఈ కీలక ప్రతిపాదనను ఈ నెల 10వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉంచనున్నారు. క్యాబినెట్ ఆమోదం అనంతరం కొత్త గెజిట్ అధికారికంగా విడుదల కానుంది. దీనితో 1975 నాటి పాత ఉత్తర్వులు రద్దు కానున్నాయి.
స్థానికులకు 95 శాతం రిజర్వేషన్
నూతన నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని స్థాయిల ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం కోటా కేటాయించారు. కేవలం మిగిలిన 5 శాతం పోస్టులు మాత్రమే ఓపెన్ కేటగిరీ కింద ఇతర ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటాయి. గతంలో జిల్లా స్థాయి పోస్టులకు 80:20 మరియు జోనల్ స్థాయికి 70:30 నిష్పత్తి ఉండేది. తాజా నిర్ణయంతో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి.
జోన్లు మరియు కేడర్ల విభజన
కొత్త విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్లు అమలులోకి వస్తాయి. ఉద్యోగ కేడర్లను మూడు రకాలుగా విభజించారు. జూనియర్ అసిస్టెంట్, ఎస్జీటీ (SGT), స్కూల్ అసిస్టెంట్ మరియు గ్రేడ్-2 హెడ్ మాస్టర్ పోస్టులు జిల్లా కేడర్ పరిధిలోకి వస్తాయి. సూపర్ ఇంటెండెంట్ మరియు మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులు జోనల్ కేడర్ పరిధిలో ఉంటాయి. డిప్యూటీ కలెక్టర్ వంటి ఉన్నత స్థాయి పోస్టులను మల్టీ జోన్ కేడర్గా పరిగణిస్తారు.
స్థానికత నిర్ధారణ ఇలా
అభ్యర్థుల స్థానికతను ఏడేళ్ల విద్యాభ్యాసం ఆధారంగా నిర్ణయిస్తారు. వరుసగా ఏడేళ్లలో కనీసం నాలుగేళ్లు ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతమే స్థానికతగా మారుతుంది. ఒకవేళ చదువుకోని పక్షంలో వారి నివాస ప్రాంతం ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తారు. ప్రస్తుతం 26 జిల్లాల ప్రకారం గెజిట్ వస్తున్నప్పటికీ అదనంగా మరో రెండు జిల్లాల (మొత్తం 28) ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. జాబ్ క్యాలెండర్ నాటికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 28 జిల్లాల ప్రకారం నియామకాలు చేపడతారు.