Skip to content
Home » Babu Jagjivan Ram : బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

Babu Jagjivan Ram : బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

హైదరాబాద్, సూర్య న్యూస్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) లో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో “ఆధునిక భారతదేశ అభివృద్ధిలో జగ్జీవన్ రామ్ పాత్ర” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి (Prof. Ghanta Chakrapani) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఆచార్య చక్రపాణి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం (Social Justice), అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. భారతదేశ స్వాతంత్య్రానికి దోహదపడటమే కాకుండా దళిత సమాజ సాధికారత (Dalit Empowerment) కోసం ఆయన చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని ప్రజా రవాణా రంగంగా మార్చిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. గతేడాది నిర్వహించిన సామాజిక సాధికార వారోత్సవాల్లో వచ్చిన సూచనల మేరకు ఆదివాసీలకు, ట్రాన్స్ జెండర్ లకు సమతా ఫెలోషిప్స్ (Samata Fellowships), ఉచిత విద్య అందిస్తున్నట్లు వెల్లడించారు.

ముఖ్య వక్తగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతకింది కాశీం (Prof. Chintakindi Kaseem) ప్రసంగిస్తూ.. జగ్జీవన్ రామ్ తన జీవితాంతం అంటరానితనంపై పోరాడారని తెలిపారు. దేశ సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడని ప్రశంసించారు. భూమి లేని నిరుపేద దళితులకు భూమి పంపిణీ చేసే అసైన్డ్ భూ పంపిణీ చట్టాన్ని తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సామాజిక, భావజాల మార్పు రానంత వరకు సమాజంలో అసమానతలు ఉంటాయని జగ్జీవన్ రామ్ ఆనాడే చెప్పారని వివరించారు.

​ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఏవీఎన్ రెడ్డి అధ్యక్షత వహించగా.. బాబూ జగ్జీవన్ రామ్ సిద్ధాంతాలు ఆచరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డీన్ డా. బానోత్ ధర్మ, ప్రొఫెసర్ సుధా రాణి, ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ తో పాటు వివిధ విభాగాల అధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.