కాలుష్య పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తాం.. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణది కీలక పాత్ర

ముంబై: తెలంగాణ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో భాగంగా బుధవారం బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితులను ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’గా అభివర్ణించిన ఆయన, భవిష్యత్ తరాల కోసం గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం అనివార్యమని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం:
హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికతో ఉందన్నారు. ఇందులో భాగంగా 2027 నాటికి ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని సాధిస్తామని, 2047 నాటికి పూర్తి నగరాన్ని నెట్ జీరోగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను పెరి-అర్బన్ జోన్లకు తరలిస్తామని స్పష్టం చేశారు.
వినూత్న ఇంధన విధానాలు:
తెలంగాణలో సోలార్ ఎనర్జీని పెద్దపీట వేస్తున్నామని, వ్యవసాయ మరియు గృహ అవసరాలకు పునరుత్పాదక ఇంధన వనరులను అందించడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ నది పునరుద్ధరణ, చెరువుల సంరక్షణ మరియు వాటర్ గ్రిడ్ నిర్వహణ ద్వారా హైదరాబాద్లో వాతావరణ ప్రమాదాలను తగ్గించి, నగరాన్ని సురక్షితంగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పులపై అనుసరించాల్సిన జాతీయ, అంతర్జాతీయ విధానాలపై సీఎం తెలంగాణ దృక్పథాన్ని స్పష్టంగా వినిపించారు.