
హైదరాబాద్: సమాజంలో మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పురుషుడు వారి రక్షణకు బ్రాండ్ అంబాసిడర్గా నిలవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” (Stand With Her) క్యాంపెయిన్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నిలబడి ప్రశ్నించే తత్వం కావాలి
ఆడపిల్లలపై వేధింపులు జరిగినప్పుడు చూసి చూడనట్టు వెళ్లడం కూడా నేరాన్ని ప్రోత్సహించడమేనని ముఖ్యమంత్రి హితవు పలికారు. సొంత కుటుంబ సభ్యులకు సమస్య ఎదురైతే ఎలా స్పందిస్తామో, ఇతర మహిళల విషయంలోనూ అదే బాధ్యతతో ఆలోచించాలని యువతకు సూచించారు. ఎవరైనా ఇబ్బంది పెడితే నిలదీసే ధైర్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు.

మహిళా స్వావలంబనే లక్ష్యం
మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పలు కీలక చర్యలను ఆయన వివరించారు
ఆర్థిక తోడ్పాటు: ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలను మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నాం..
యజమానులుగా మహిళలు: సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా మారుస్తున్నాం.
అంతర్జాతీయ మార్కెట్: గ్రామీణ మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం.
గౌరవం: మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు, తెలంగాణ తల్లి విగ్రహాలను రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిపాం.
సైబర్ నేరాలపై ఉక్కుపాదం
ప్రస్తుతం భౌతిక దాడుల కంటే ఆన్లైన్ దాడులు, డీప్ ఫేక్ వీడియోల ముప్పు పెరిగిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసినట్లు వెల్లడించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అమ్మాయిదే తప్పు అనే పాతకాలపు ఆలోచనా ధోరణిని వీడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంలో మహిళల పాత్ర కీలకమని, వారు సంపూర్ణ భద్రతతో ఉన్నప్పుడే రాష్ట్ర పురోగతి సాధ్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ చారు సిన్హా, సినీ నటుడు సాయి దుర్గ తేజ్ తదితరులు పాల్గొన్నారు.