
హైదరాబాద్: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. చివరకు భక్తిని, పవిత్రమైన పండుగలను కూడా తమ వికృత చేష్టలకు వేదికగా మార్చుకుంటోంది. మహాశివరాత్రి పర్వదినాన దైవ ప్రసాదం పేరుతో మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేసిన యువకుల తీరుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఇది సాహసం కాదు, జీవితాన్ని నాశనం చేసుకునే నేరమని ఆయన హెచ్చరించారు.
భక్తి ముసుగులో వికృత ఉన్మాదం:
మహాశివరాత్రి భక్తికి నిదర్శనం, ముక్తికి సోపానం అని పేర్కొన్న సజ్జనార్, అటువంటి పవిత్రమైన రోజున మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం దేవుడి ముందు ఇలాంటి పనులు చేయడం వికృతమైన ఉన్మాదమని ఆయన అభివర్ణించారు. సాహసం అనుకుని చేసే ఇటువంటి పనులు నేరుగా కటకటాల వెనుకకు చేరుస్తాయని స్పష్టం చేశారు.

NDPS చట్టం ప్రయోగిస్తే జీవితం బలి :
రీల్స్ కోసం విలువలనే వదిలి రోడ్డున పడుతున్న యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక్కసారి NDPS (మత్తు పదార్థాల నియంత్రణ) చట్టం ప్రయోగిస్తే.. జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది” అని ఆయన గట్టిగా హెచ్చరించారు. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం జీవితాలను బలిపెట్టవద్దని యువతకు సూచించారు.
కఠిన చర్యలు తప్పవు:
ఇటువంటి బాధ్యతారహితమైన చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. సోషల్ మీడియాను సృజనాత్మకతకు వేదికగా మార్చుకోవాలే తప్ప, వ్యసనాలకు వాకిలిగా మార్చుకోవద్దని హితవు పలికారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సజ్జనార్ చేసిన హెచ్చరిక నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.