
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది, ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది
సవాల్ చేసిన సీబీఐ:
ఇటీవల రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ జితేంద్ర సింగ్ ఈ కేసులో కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే, అయితే నిందితులకు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది
హైకోర్టులో వాదనలు:
సోమవారం (మార్చి 9) ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది, దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ట్రయల్ కోర్టు తీర్పు ఉందని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు, కేజ్రీవాల్, సిసోడియా, కవిత పాత్రను అంచనా వేయడంలో స్పెషల్ కోర్టు పొరబడిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు, మద్యం పాలసీ వెనుక ఉన్న భారీ కుట్రను చూడకుండా విడివిడి అంశాలుగా పరిగణించడం వల్ల కేసు నీరుగారిందని ఆరోపించారు, ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని తుషార్ మెహతా కోరారు.
కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం:
సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు సీబీఐపై ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది, ఈ పిటిషన్పై విచారణ ముగిసే వరకు ఈడీ కేసులో విచారణను సైతం వాయిదా వేయాలని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది, అలాగే కేజ్రీవాల్, కవిత సహా 23 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ సీబీఐ పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది, తదుపరి విచారణను 2026 మార్చి 16కు వాయిదా వేసింది