
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో 62వ ఎడిషన్ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిట్ ఇండియా మూవ్మెంట్ సహకారంతో జరిగిన ఈ సైక్లింగ్ డ్రైవ్ను ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా డీడీజీ మయాంక్ శ్రీవాస్తవ, ఈఎస్ఐసీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మనీష్ కుమార్ అగర్వాల్ పాల్గొని క్రీడాకారులను, ప్రత్యేక అతిథులను సన్మానించారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా జరిగిన ఈ వేడుకలో యువత, ఈఎస్ఐసీ అధికారులు మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సైక్లింగ్ చేశారు. ఫిట్నెస్, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన సమాజం పట్ల అవగాహన కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈఎస్ఐసీ సేవలను విస్తరిస్తూ, ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి శారీరక దృఢత్వానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.