Skip to content
Home » ​రూ. 56 లక్షలతో చెక్కేసిన డ్రైవర్.. విమానమెక్కబోతుండగా పోలీసులు ఏం చేశారో తెలుసా?

​రూ. 56 లక్షలతో చెక్కేసిన డ్రైవర్.. విమానమెక్కబోతుండగా పోలీసులు ఏం చేశారో తెలుసా?

హైదరాబాద్, ఫిబ్రవరి 24: గచ్చిబౌలిలో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుండి రూ. 56 లక్షల నగదుతో పరారైన డ్రైవర్ బాడిగెరె అజిత్ కుమార్ ఉదంతం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా సాగిన ఈ దొంగతనం చివరకు పోలీసుల వ్యూహాత్మక ఆపరేషన్‌తో ముగిసింది. నగదుతో మాయమైన కిలాడీ డ్రైవర్‌ను సైబరాబాద్ పోలీసులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద చాకచక్యంగా పట్టుకున్నారు.

రాష్ట్రాలు దాటిన వేట

చోరీ జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు తప్పించుకోవడానికి పలు రాష్ట్రాలు మారుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయితే అతడి కదలికలను నిశితంగా గమనించిన పోలీసులు, అతను దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నాడనే పక్కా సమాచారంతో అక్కడే మాటువేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి రూ. 34.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

భద్రతా సంస్థపై వేటు

ఈ ఘటనలో నగదు రవాణా చేస్తున్న ‘సంగం సెక్యూరిటీ ఏజెన్సీ’ నిబంధనలను పాటించలేదని పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం (PSARA) కింద సదరు సంస్థపై కఠిన చర్యలు ప్రారంభించారు. మరోవైపు, ఈ కేసులో నిందితుడి ఆచూకీ కోసం కీలక సమాచారం అందించిన ఎస్వీఆర్ ట్రావెల్స్ ప్రతినిధి ఉమాకాంత్‌ను పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *