Skip to content
Home » గద్దర్ అవార్డ్స్ వేడుకలో సందడి: ‘రష్మిక మా ఊరి కోడలు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

గద్దర్ అవార్డ్స్ వేడుకలో సందడి: ‘రష్మిక మా ఊరి కోడలు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్, సూర్య న్యూస్ :​ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. సినీ కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్డీసీ (FDC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో అద్భుత నటన కనబరిచిన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు ఉత్తమ నటి (బెస్ట్ ఫీమేల్ యాక్టర్) అవార్డును ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు.

అవార్డు అందజేసే క్రమంలో రష్మికను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. యాంకర్ సుమ అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ, రష్మికను ‘మా ఊరి కోడలు’ అని రేవంత్ రెడ్డి సంబోధించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీనికి స్పందనగా రష్మిక మందన్న మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి చేతుల మీదుగా, అది కూడా గద్దర్ పేరిట ఇస్తున్న అవార్డును అందుకోవడం తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన విషయమని సంతోషం వ్యక్తం చేశారు.

​ఈ మెగా ఈవెంట్‌కు టాలీవుడ్ మరియు కోలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, లోకనాయకుడు కమల్ హాసన్, అక్కినేని నాగార్జున, అమల, రామ్ చరణ్, అక్కినేని నాగచైతన్య, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వనజ ఉదయ్ బృందం తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో అలరించగా, శ్రేయా ఘోషల్, దేవి శ్రీ ప్రసాద్, మంగ్లీ తమ పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.