
Hyderabad, Surya News: హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత ఇక్రిశాట్ (ICRISAT) సంస్థపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఒక సభలో మాట్లాడుతూ ఇక్రిశాట్ ను అమెరికా ప్రభుత్వానికి చెందిన రీసెర్చ్ సెంటర్ గా ఆయన అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనం అంటూ ఎక్స్ (Twitter) వేదికగా సెటైర్లు వేశారు. కళ్ల ముందు ఉన్న సంస్థల పైనా ముఖ్యమంత్రికి క్లారిటీ లేకపోవడం దారుణం అని ఆయన విమర్శించారు.
ఇక్రిశాట్ ఏ ఒక్క దేశానికో చెందిన సంస్థ కాదని హరీష్ రావు స్పష్టం చేశారు. అది CGIAR వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధన సంస్థ (International Research Institute) అని ఆయన గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), యూఎన్డీపీ (UNDP), మరియు వరల్డ్ బ్యాంక్ (World Bank) తదితర సంస్థల సహకారంతో ఇది ఏర్పాటైంది. ఇలాంటి ప్రాథమిక విషయాలు కూడా తెలియకుండా మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్ర పరువు తీయకండి అని హరీష్ రావు చురకలు అంటించారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేసే ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా ఉండాలని హరీష్ రావు సూచించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడటం అలవాటు చేసుకోవాలని ఆయన రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సలహా ఇచ్చారు. నల్లమల సరిహద్దులు, కృష్ణా-గోదావరి జలాల మీదే కాదు, స్థానికంగా ఉన్న సంస్థల పైన కూడా సీఎంకు అవగాహన లేకపోవడం శోచనీయం అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) హాట్ టాపిక్ గా మారింది.