
హైదరాబాద్: నగరంలోని మణికొండ ప్రాంతంలో ప్రధాన నీటి సరఫరా పైప్లైన్ పగిలిపోవడంతో ఏర్పడిన అత్యవసర పరిస్థితిని జలమండలి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చక్కదిద్దుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున మణికొండ వద్ద ధ్వంసమైన 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్లైన్ మరమ్మతు పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అర్ధరాత్రి వేళ పైప్లైన్ ప్రమాదం
ఖానాపూర్ నుండి బోజగుట్ట వరకు వెళ్లే ఈ ప్రధాన పైప్లైన్ మంగళవారం తెల్లవారుజామున సుమారు 2:40 గంటల సమయంలో మణికొండలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో పగిలిపోయింది. సమాచారం అందిన వెంటనే స్పందించిన జలమండలి యంత్రాంగం, నీటి వృధాను అరికట్టేందుకు సింగపూర్ మరియు ఖానాపూర్ నుండి సరఫరాను ఉదయం 3 గంటలకే నిలిపివేసింది. ఉదయం 7 గంటల నుండి పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి.

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశం
మరమ్మతుల పనులను పరిశీలించిన ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ మరియు ట్రాన్స్మిషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పైప్లైన్ లీకేజీ వల్ల నీటి సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న పైప్ భాగాన్ని తొలగించి, 1150 మి.మీ. వ్యాసం గల ఎమ్ఎస్ బ్యారెల్స్ను అమర్చే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ప్రభావిత ప్రాంతాలు ఇవే..
పైప్లైన్ మరమ్మతుల కారణంగా ఈ క్రింది ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది:
గండిపేట్, కొకాపేట్, నార్సింగిమంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్మణికొండ, షేక్పేట్ మరియు బోజగుట్ట రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
మరమ్మతు పనులు మంగళవారం సాయంత్రం 7 గంటల నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత దశలవారీగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని జలమండలి ప్రకటించింది.