
హైదరాబాద్, మార్చి 19, 2026 (సూర్య న్యూస్): భాగ్యనగరవాసుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున సాగుతున్న కల్తీ పనీర్ తయారీ కేంద్రాన్ని అధికారులు బట్టబయలు చేశారు. ఈ దాడుల్లో సుమారు 3,000 కేజీల కల్తీ పనీర్తో పాటు భారీగా నిల్వ ఉంచిన ఖోవా, నెయ్యి, క్రీమ్ను స్వాధీనం చేసుకున్నారు.
ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు
ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు మహంకాళి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయ సమీపంలోని శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్లతో పాటు మరో నాలుగు హోల్సేల్ డెయిరీ షాపులపై ఏకకాలంలో దాడులు చేశారు.
ఈ తనిఖీల్లో ఒక్క శ్రీ బాలాజీ డెయిరీలోనే 1,600 కేజీల కల్తీ పనీర్ లభించగా, విజయ్ మిల్క్లో 1,000 కేజీల నిల్వలను గుర్తించారు. మొత్తం మీద 3,892 కేజీల నాసిరకం డెయిరీ ఉత్పత్తులను పోలీసులు సీజ్ చేశారు.
కెమికల్స్, సింథటిక్ మెటీరియల్తో తయారీ
పాలు వాడకుండానే కేవలం హానికరమైన రసాయనాలు, సింథటిక్ మెటీరియల్స్, పిండి పదార్థాలు మరియు నాసిరకం ప్లాస్టిక్ ప్యాకింగ్ మెటీరియల్ను ఉపయోగించి ఈ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. కిలో కేవలం ₹280 కే విక్రయిస్తూ.. నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులు మరియు ఈవెంట్ ఆర్గనైజర్లకు భారీగా సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకే వస్తుండటంతో వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
ఆరుగురు అరెస్ట్.. పరారీలో యజమానులు
ఈ రాకెట్తో సంబంధమున్న ఆరుగురు కార్మికులు, చిన్న స్థాయి వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కల్తీ వ్యాపారాన్ని వెనుక నుండి నడిపిస్తున్న ప్రధాన యజమానులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి నిందితులపై కేసులు నమోదు చేసి, సదరు యూనిట్లను సీజ్ చేశారు.
వైద్యుల హెచ్చరిక:
ఇటువంటి కల్తీ పనీర్, నెయ్యి తినడం వల్ల గ్యాస్ట్రో ఎంటరైటిస్, లివర్ దెబ్బతినడం మరియు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.
పోలీసుల సూచన: జాగ్రత్త వహించండి
నగరంలోని ప్రజలు విచ్చలవిడిగా లభించే విడి పనీర్, డెయిరీ ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కేవలం సర్టిఫైడ్ బ్రాండ్లు, నమ్మకమైన షాపుల్లోనే వస్తువులను కొనుగోలు చేయాలి” అని టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. నగరవ్యాప్తంగా మిగిలిన డెయిరీ షాపులపై కూడా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #FakePaneerRacket అనే హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతోంది. ప్రజలు తమకు తెలిసిన కల్తీ సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని కోరారు.