
హైదరాబాద్: నగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక తనిఖీల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో నగరం అంతటా నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 492 మందిని పోలీసులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.
వాహనాల వారీగా వివరాలు:
పట్టుబడిన వారిలో అత్యధికంగా 412 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 29 మంది త్రీ వీలర్ డ్రైవర్లు, 51 మంది ఫోర్ వీలర్ మరియు ఇతర వాహనదారులు ఉన్నారు.
మద్యం స్థాయి (BAC levels):
తనిఖీల సమయంలో బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 109 మందికి 30-50 మధ్య, 205 మందికి 51-100 మధ్య బీఏసీ లెవల్స్ నమోదయ్యాయి. అలాగే 11 మంది వాహనదారులకు 300 పాయింట్ల కంటే ఎక్కువ స్థాయిలో మద్యం మత్తు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల హెచ్చరిక :
నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో అస్సలు రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ప్రత్యేక తనిఖీలు మున్ముందు కూడా నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, మద్యం సేవించినప్పుడు వాహనాలు నడపవద్దని వారు విజ్ఞప్తి చేశారు.