Skip to content
Home » Strait of Hormuz: అమెరికాకు షాక్.. భారత్ కు ‘హోర్ముజ్’ గిఫ్ట్ ఇచ్చిన ఇరాన్!

Strait of Hormuz: అమెరికాకు షాక్.. భారత్ కు ‘హోర్ముజ్’ గిఫ్ట్ ఇచ్చిన ఇరాన్!

టెహ్రాన్, సూర్య న్యూస్, వెబ్ డెస్క్ :ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ (India) తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు ఇరాన్ భారీ ఊరటనిచ్చింది. వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఈ ఐదు దేశాల నౌకల రాకపోకల కోసం ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘీ (Abbas Araghchi) తాజాగా ప్రకటించారు. దీంతో ఆయా దేశాలకు చమురు సరఫరాలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది.

​హోర్ముజ్ జలసంధిలో భారత్ తో సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఎటువంటి ఆంక్షలు విధించబోమని మంత్రి స్పష్టం చేశారు. భారత్ తో పాటు రష్యా (Russia), చైనా (China), పాకిస్థాన్ (Pakistan), ఇరాక్ (Iraq) దేశాలకు చెందిన నౌకలు ఈ జలమార్గం గుండా సురక్షితంగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. అనేక దేశాలు తమ నౌకల రక్షణ కోసం తమను సంప్రదించాయని, మిత్రదేశాలుగా భావించే వారికే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఇరాన్ మీడియా ప్రతినిధులతో అబ్బాస్ పేర్కొన్నారు. తమ సాయుధ దళాలు ఈ నౌకలకు రక్షణ కల్పిస్తాయని, యుద్ధం తర్వాత కూడా ఈ సదుపాయం కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

​ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ధృవీకరించింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ కు చెందిన గ్యాస్ ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు స్వదేశానికి చేరే మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఐదు గ్యాస్ ట్యాంకర్లు అనుమతి కోసం ఎదురుచూస్తుండగా, ఇరాన్ తాజా నిర్ణయంతో వాటి ప్రయాణంపై స్పష్టత రానుంది. అయితే ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగే దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వని దేశాల నౌకలకే ఈ ప్రవేశం ఉంటుందని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.