
జడ్చర్ల:మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం సిగ్గుపడేలా అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పోస్ట్మార్టమ్ కోసం మార్చరీలో ఉంచిన ఒక వ్యక్తి మృతదేహాన్ని వీధికుక్క పీక్కుతిన్న ఉదంతం కలకలం సృష్టించింది. అధికారుల నిర్లక్ష్యం, మార్చరీ భవన దుస్థితి కారణంగానే ఈ దారుణం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలడంతో, ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
అసలేం జరిగిందంటే?
జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన భీమేశ్వర్ (33) అనే లారీ డ్రైవర్, ఫిబ్రవరి 28న ఇంటి నుండి బయటకు వెళ్లి చెరువులో పడి మరణించాడు. పోలీసులు సోమవారం (మార్చి 2) మధ్యాహ్నం మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్మార్టమ్ నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి పాత మార్చరీ భవనానికి తరలించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండటంతో అధికారులు దానిని నేలపైనే ఉంచారు.
అయితే, పాత మార్చరీ భవనానికి సరైన తలుపులు, కప్పు లేకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక వీధికుక్క లోపలికి చొరబడింది. మృతదేహం పొట్ట భాగాన్ని పీక్కుతింటుండగా గమనించిన పోలీసులు, కుటుంబ సభ్యులు వెంటనే కుక్కను తరిమేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
మంత్రి దామోదర్ రాజనర్సింహ సీరియస్
ఈ అమానవీయ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ వేగవంతమైంది.
విచారణ మరియు సస్పెన్షన్ల పర్వం
మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం (మార్చి 3) ఉదయం కమిషనర్ అజయ్ కుమార్ జడ్చర్ల ఆసుపత్రిని సందర్శించారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది నుండి వివరాలు సేకరించారు. మార్చరీ భవనం ధ్వంసావస్థలో ఉండటం, విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన నిర్ధారించారు. ఈ క్రమంలో కింది అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
- డాక్టర్ చంద్రకళ (ఆసుపత్రి సూపరింటెండెంట్)
- డాక్టర్ హరినాథ్ (డ్యూటీ ఆర్ఎంఓ)
- డాక్టర్ మునీషా (డ్యూటీ మెడికల్ ఆఫీసర్)
- రవిప్రకాశ్ (మార్చరీ సపోర్టింగ్ స్టాఫ్ – మనో
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతదేహాలకు కనీస గౌరవం లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.