Skip to content
Home » Congress Govt : రేవంత్ రెడ్డి గారూ.. ఇవేనా 200 ఏళ్లు నిలిచే పనులు? గద్దెల సాక్షిగా చిన్నారి జీవితం బుగ్గిపాలు!

Congress Govt : రేవంత్ రెడ్డి గారూ.. ఇవేనా 200 ఏళ్లు నిలిచే పనులు? గద్దెల సాక్షిగా చిన్నారి జీవితం బుగ్గిపాలు!

ములుగు, సూర్య న్యూస్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల చెంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పనుల్లోని నాణ్యతా లోపం ఒక ఆరేళ్ల బాలుడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. అభివృద్ధి పేరుతో చేపట్టిన పనులు ఆ పసివాడి కాలు తీసేశాయి.

​ఏం జరిగింది?

మేడారం ప్రధాన పూజారి సిద్దబోయిన రానా రమేష్ కుమారుడు యువన్ (6) బుధవారం సాయంత్రం గద్దెల ప్రాంగణంలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్రానైట్ రాళ్లు ఒక్కసారిగా జారి బాలుడి రెండు కాళ్లపై పడ్డాయి. సుమారు 5 అడుగుల ఎత్తు నుండి పడిన భారీ స్లాబుల ధాటికి బాలుడి ఎడమ పాదం పూర్తిగా నలిగిపోయింది. కుడి కాలు రెండు చోట్ల విరిగింది. హుటాహుటిన వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సలో భాగంగా ఎడమ పాదాన్ని తొలగించాల్సి వచ్చింది.

ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపమా?

2026 మహాజాతర కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ. 251 కోట్లు కేటాయించింది. ఇందులో కేవలం గద్దెల పునర్నిర్మాణం కోసమే రూ. 110 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిర్మాణాలు వందల ఏళ్లు చెక్కుచెదరవని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ జాతర ముగిసి మూడు నెలలు కూడా గడవకముందే ఆ ‘శాశ్వత’ రాళ్లు ఊడి పడటం పనుల్లోని నాణ్యతకు అద్దం పడుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల ధన దాహం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూజారి కుటుంబంలో విషాదం

అమ్మవార్ల సేవలో తరించే పూజారి కుటుంబంలోనే ఇలాంటి ఘటన జరగడం భక్తులను కలిచివేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు క్రేన్లతో ఆ గ్రానైట్ స్లాబులను తొలగించి చేతులు దులుపుకున్నారు. కానీ కాలు కోల్పోయిన ఆ చిన్నారి భవిష్యత్తుకు సమాధానం చెప్పే వారే కరువయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాలుడి కుటుంబానికి భారీ నష్టపరిహారం అందించాలని, నాసిరకం పనులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.