Skip to content
Home » చరిత్రలో ఈ రోజు: ‘పురట్చి తలైవి’ జయలలిత 78వ జయంతి – తమిళనాడు రాజకీయ చరిత్ర మార్చిన ‘అమ్మ’

చరిత్రలో ఈ రోజు: ‘పురట్చి తలైవి’ జయలలిత 78వ జయంతి – తమిళనాడు రాజకీయ చరిత్ర మార్చిన ‘అమ్మ’

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తమిళనాడు రాజకీయ యవనికపై ఒక ధ్రువతారగా, కోట్లాది మంది ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత 78వ జయంతి నేడు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మేలుకోటేలో జన్మించిన ఆమె ప్రస్థానం వెండితెరపై మెరుపు తీగలా మొదలై, కోటరీ రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో అజేయ శక్తిగా ఎదిగిన ఆమె పట్టుదల ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం.

వెండితెర రాణి – MGR తో అపూర్వ అనుబంధం

జయలలిత సినీ ప్రస్థానంలో ఎం.జీ. రామచంద్రన్ (MGR) పాత్ర మరువలేనిది. వీరిద్దరి జోడీ వెండితెరపై ఒక వెలుగు వెలిగింది. సుమారు 28 సినిమాల్లో వీరు జంటగా నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. MGR కేవలం ఆమెకు కో-స్టార్ మాత్రమే కాదు, ఆమె రాజకీయ గురువు కూడా. ఆయన స్ఫూర్తితోనే జయలలిత ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీలో చేరి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు.

తెలుగులో NTR – ANR సరసన ‘జయ’ కేతనం

జయలలిత తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నటిగా వెలుగొందారు. తెలుగులో సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె, సీనియర్ ఎన్టీఆర్ సరసన 12 చిత్రాల్లోనూ, ఏఎన్ఆర్ పక్కన 8 చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. సినిమా రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాల వైపు అడుగులు వేశారు.

అవమానం నుండి అజేయ శక్తిగా: అసెంబ్లీ ప్రతిజ్ఞ

జయలలిత రాజకీయ ప్రస్థానంలో 1989 మార్చి 25 ఒక మాయని మచ్చ. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆమెపై అధికార పార్టీ సభ్యులు భౌతిక దాడికి దిగి, ఆమెను తీవ్రంగా అవమానించారు. ఆనాడు కన్నీళ్లతో సభను వీడిన ఆమె, “మళ్లీ ఈ సభలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతాను” అని సింహంలా గర్జించి ప్రతిజ్ఞ చేశారు. చెప్పినట్లుగానే 1991లో భారీ మెజారిటీతో విజయం సాధించి, ముఖ్యమంత్రిగానే ఆ సభలో అడుగుపెట్టి తన పట్టుదలను నిరూపించుకున్నారు.

​ఆరు సార్లు ముఖ్యమంత్రిగా – ‘అమ్మ’ అనే బ్రాండ్తమిళనాడు రాజకీయ చరిత్రలో జయలలిత ఆరు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ప్రజల కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలు ‘అమ్మ’ బ్రాండ్‌గా ప్రపంచ ప్రసిద్ధి పొందారు.

అమ్మ క్యాంటీన్: ఆకలితో ఉన్న పేదల కోసం అతి తక్కువ ధరకే భోజనం.

అమ్మ వాటర్: సామాన్యులకు స్వచ్ఛమైన తాగునీరు.

క్రెడిల్ బేబీ స్కీమ్: ఆడపిల్లల రక్షణ కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం.

సమకాలీనుడైన సీనియర్ ఎన్టీఆర్ తెలుగు గడ్డపై ఆత్మగౌరవ నినాదంతో ఎలాగైతే ప్రభంజనం సృష్టించారో, జయలలిత కూడా తమిళ గడ్డపై మహిళా శక్తిగా, పేదల పాలిట ‘అమ్మ’గా అజేయమైన ముద్ర వేశారు. 2016 డిసెంబర్ 5న ఆమె భౌతికంగా దూరమైనా, ఆమె చూపిన ధైర్యం, పట్టుదల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *