
హైదరాబాద్, సూర్య న్యూస్ : రణవీర్ సింగ్ హీరోగా మరియు ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 సినిమా కేవలం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా భారతీయ సినిమా పునాదులనే కదిలిస్తోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు, భారీ కలెక్షన్స్ చూసి గుడ్డిగా సంబరపడితే ఆదిత్య ధర్ సృష్టిస్తున్న అసలైన భూకంపాన్ని మిస్ అవుతామని చెబుతూ ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని పూర్తిగా మార్చేసిందని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.
గతంలో తాను తీసిన శివ, సత్య, కంపెనీ మరియు సర్కార్ లాంటి సినిమాలు కేవలం స్కూల్ పిల్లలు రాసిన వ్యాసాల లాంటివని కానీ ఆదిత్య ధర్ తీసిన ఈ సినిమా మాత్రం భవిష్యత్ సినిమాకు ఒక పెద్ద సైన్స్ థీసిస్ లాంటిదని వర్మ ప్రశంసలు కురిపించారు, తన పాత సినిమాలను ఒక సైంటిస్ట్ లాగా అధ్యయనం చేసిన ఆదిత్య ధర్ దానికి దేశభక్తి, జియోపాలిటిక్స్, టెర్రరిజం, ఎస్పియోనేజ్, ఇంటెలిజెన్స్ వార్ఫేర్ మరియు గుండెను పిండేసే మానవతా విలువల కలయికను జోడించి ఒక అద్భుతమైన సృష్టి చేశాడని ఆ లావా లాంటి సినిమా దెబ్బకు ఫిల్మ్ ఇండస్ట్రీ పునాదులు వణుకుతున్నాయని ఆయన అభివర్ణించారు.
ధురంధర్ 2 సినిమా బెంచ్ మార్క్ తో పోల్చుకోకుండా మార్చి 19కి ముందు రాసుకున్న పాత స్క్రిప్ట్లతోనే ఎవరైనా దర్శకులు సినిమాలు తీస్తే వాళ్ళు కచ్చితంగా ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోతారని వర్మ హెచ్చరించారు, ఈ సినిమా కేవలం ఒక గేమ్ చేంజర్ మాత్రమే కాదని సినిమా తీసే పాత రూల్ బుక్ మొత్తాన్ని కాల్చేసిందని స్పష్టం చేస్తూ దర్శకులంతా తమ పాత కథలన్నింటినీ ధురంధర్ సృష్టించిన మంటల్లో వేసి డ్రాయింగ్ బోర్డ్ వద్దకు వెళ్లి మళ్లీ కొత్తగా కథలు రాసుకోవాలని వర్మ సూచించారు.
కళ అంటే ఏమిటి అన్నది ముఖ్యం కాదని అది ఎలా ఉండగలదు మరియు ఎలా ఉండాలి అన్నదే ముఖ్యమన్న ప్రముఖ రచయిత్రి ఐన్ రాండ్ కొటేషన్ ను ఈ సందర్భంగా గుర్తుచేసిన వర్మ సినిమా ఎలా ఉండాలో చూపించిన ఆదిత్య ధర్ కు భారతీయ సినిమా భవిష్యత్తు తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు మరియు నిర్మాతలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.