
హైదరాబాద్, సూర్య న్యూస్ : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ మరియు ఆయన సతీమణి, నటి యామీ గౌతమ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఆ దంపతుల పతనం కోసం సినిమా పరిశ్రమలో చాలా మంది ఎదురుచూస్తున్నారంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అసూయ పడుతున్నారు :
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘దురంధర్’ మూవీ ఘనవిజయం సాధించడం చాలా మందిని భయపెట్టిందని వర్మ విశ్లేషించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతినే మార్చేసిందని, మిగిలిన వారందరూ పునరాలోచించుకునేలా చేసిందని ఆయన ప్రశంసించారు. ఆదిత్య ధర్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సినిమా పరిశ్రమలో ఎంతో మంది ఆయన పతనం కోరుకుంటున్నారని, అందుకే ఆ దంపతులు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని వర్మ సూచించారు.
దురంధర్-2 పై అంచనాలు :
ఆదిత్య ధర్ కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సినిమాలు తీస్తున్నారని ఆర్జీవీ కొనియాడారు. ఆయన మేకింగ్ స్టైల్ చూసి హాలీవుడ్ దర్శకులు కూడా ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు. కాగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘దురంధర్-2’ షూటింగ్ మే 19 నుండి ప్రారంభం కానుందని సమాచారం.