
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రచారకర్తగా వ్యవహరించారు. జేఎన్టీయూ హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ప్రచార వీడియోను విడుదల చేశారు. మహిళల రక్షణ, సాధికారత మరియు వారి పట్ల సమాజం బాధ్యతాయుతంగా ఉండాలనే సందేశంతో ఈ వీడియోను రూపొందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ఈ ప్రచారంలో భాగస్వామ్యం అయిన సాయి ధరమ్ తేజ్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ వీడియో ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు, ఆపద సమయంలో ప్రభుత్వం అందించే భద్రతా సేవలను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా ప్రతినిధులు, విద్యార్థినులు పాల్గొని ‘స్టాండ్ విత్ హర్’ ప్రచారానికి మద్దతు తెలిపారు.