
సనత్ నగర్, సూర్య న్యూస్: పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సనత్ నగర్లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక చైతన్యంతో విరాజిల్లింది. సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో చిన్నారులచే “శ్రీరామనామ లిఖితం” కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన అనేక మంది బాలబాలికలు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు.
తమ వెంట ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు తెచ్చుకున్న చిన్నారులు భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామాన్ని ఉచ్చరిస్తూ కాగితాలపై లిఖించారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిరంతరాయంగా సాగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సమయపాలన విషయంలో ఆలయ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తూ కార్యక్రమాన్ని క్రమశిక్షణతో పూర్తి చేశారు. లిఖిత కార్యక్రమం అనంతరం చిన్నారులకు వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భక్తులకు, చిన్నారులకు ప్రసాద వితరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు పరాశరం రవీంద్రాచార్యులు, కార్యనిర్వహణ అధికారి ఎన్ సత్యనారాయణ, ఆలయ సిబ్బంది మరియు ఇతర అర్చక బృందం పాల్గొన్నారు. మన పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన రామనామ స్మరణ అనే గొప్ప సంపదను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. సనత్ నగర్ ప్రాంతంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించిన ఈ తరహా కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.