
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణాపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (V&E) శాఖ కొరడా ఝుళిపించింది, సహజ వనరుల దోపిడీని అడ్డుకునే చర్యల్లో భాగంగా మార్చి 9 మరియు 10 తేదీల్లో మూడు జిల్లాల్లో భారీ ఎత్తున మెరుపు దాడులు నిర్వహించి భారీగా ఇసుకతో పాటు యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన బృందాలుహైదరాబాద్ సిటీ-2 యూనిట్ మరియు వరంగల్ యూనిట్ కు చెందిన విజిలెన్స్ బృందాలు పక్కా సమాచారంతో నారాయణపేట, మహబూబ్ నగర్, మరియు ఖమ్మం జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి, నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని రాకొండ గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని గురుకొండ గ్రామం, అలాగే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది, ముఖ్యంగా కోయిల్ సాగర్ ప్రాంతంలోని ఊక చెట్టు వాగు మరియు మున్నేరు వాగు వద్ద పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

1875 మెట్రిక్ టన్నుల ఇసుక, భారీ వాహనాలు స్వాధీనంఈ మెరుపు దాడుల్లో రవాణా మరియు విక్రయాల కోసం అక్రమంగా తవ్వి నిల్వ ఉంచిన సుమారు 1875 మెట్రిక్ టన్నుల ఇసుకను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు, అలాగే ఇసుక తవ్వకాలు మరియు రవాణా కోసం ఉపయోగిస్తున్న 4 భారీ ఎక్స్కవేటర్లు, 2 టిప్పర్లు, 7 ట్రాక్టర్లను సీజ్ చేశారు.
మూడు కేసులు నమోదు, ఏడుగురి అరెస్ట్ఈ అక్రమ ఇసుక దందా వెనుక పలువురు వ్యక్తులు మరియు ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు విజిలెన్స్ ఆపరేషన్ లో వెల్లడైంది, అధికారుల ఫిర్యాదు మేరకు మరికల్, దేవరకద్ర, మరియు ముదిగొండ పోలీస్ స్టేషన్లలో మొత్తం 3 కేసులు నమోదు చేయించారు, ఈ దందాకు సంబంధించి 13 మంది నిందితులను గుర్తించగా వారిలో 7 గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 14432ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ సహజ వనరులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ స్పష్టం చేసింది, ఎక్కడైనా అక్రమ మైనింగ్ లేదా ప్రభుత్వ వనరుల దుర్వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే ప్రజలు ఎవరైనా నిర్భయంగా టోల్ ఫ్రీ నంబర్ 14432 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.