
కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్ డివిజన్లో గత వారం రోజులుగా స్థానికులను వేధిస్తున్న మురుగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. రోడ్లపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ, అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులకు విన్నవించినా స్పందన కరువవడంతో, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ స్వయంగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు.

అధికారుల ఉదాసీనత.. స్థానికుల ఇబ్బందులు
షాపూర్ నగర్ ప్రధాన రహదారులపై మురుగునీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దుర్వాసన వెదజల్లుతుండటంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు, ఈ విషయాన్ని పుప్పాల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సంబంధిత అధికారులతో చర్చించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

సొంత ఖర్చులతో క్లీనింగ్ పనులుప్రభుత్వ యంత్రాంగం నుండి సరైన స్పందన రాకపోవడంతో, ప్రజా సమస్యను దృష్టిలో ఉంచుకుని పుప్పాల భాస్కర్ తన సొంత నిధులతో డ్రైనేజీ లైన్ క్లీనింగ్ పనులను ప్రారంభించారు. సిబ్బందిని రప్పించి పూడిక తీయించడంతో నిలిచిపోయిన మురుగునీరు సాఫీగా వెళ్ళేలా చర్యలు తీసుకున్నారు. అధికారులు స్పందించాల్సిన చోట ఒక రాజకీయ నాయకుడు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించడం పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.