
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర నాలుగవ గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా బుధవారం రాజ్భవన్లో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ శివ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
ఈ వేడుకకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం
ఉత్తరప్రదేశ్కు చెందిన 73 ఏళ్ల శివ ప్రతాప్ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, యూపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జిష్ణు దేవ్ వర్మ స్థానంలో ఇప్పుడు ఆయన తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. మార్చి 16 నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.