Skip to content
Home » జాతీయ పామ్ బోర్డు ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రి కుమారస్వామికి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి

జాతీయ పామ్ బోర్డు ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రి కుమారస్వామికి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, సూర్య న్యూస్: దేశవ్యాప్తంగా పామ్ చెట్లపై ఆధారపడి జీవిస్తున్న కుల వృత్తిదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తక్షణమే జాతీయ పామ్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కోరారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కలిసి ఆయన ఈ మేరకు విన్నవించారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, మాజీ ఎంపీ ఉమేష్ జాదవ్, జేడీఎస్ నాయకులు బాల్ రాజ్ గుత్తేదార్, వీకే గౌడ, ఆల్ ఇండియా గౌడ ప్రతినిధులు జీకే పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ తరహా నీరా పాలసీ దేశవ్యాప్తంగా అమలు చేయాలి

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్న నీరా పాలసీని దేశవ్యాప్తంగా తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరారు. తాటి, ఈత, జీలగా, ఖర్జూర వంటి పామ్ చెట్ల ద్వారా లభించే ఉత్పత్తులతో బెల్లం, చక్కెర, సిరప్ వంటి ఆహార పదార్థాలతో పాటు గృహ అలంకరణ వస్తువులను తయారు చేసే అవకాశం ఉందని ఆయన వివరించారు. అనేక ఇతర దేశాలు ఈ ఉత్పత్తుల ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నాయని, భారతదేశంలో కూడా కోట్లాది పామ్ చెట్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. వీటికి సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

ఆరోగ్యకరమైన ఉత్పత్తులకు ప్రాధాన్యత

ప్రస్తుతం మార్కెట్‌లో లభించే రసాయన కూల్ డ్రింక్స్ వల్ల ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన పామ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన పానీయాలు అందించవచ్చని సూచించారు. పామ్ ఉత్పత్తులతో తయారయ్యే బెల్లం, చాక్లెట్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ఈ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు.

కేంద్ర మంత్రి సానుకూల స్పందన

జాతీయ స్థాయిలో పామ్ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల వృత్తిదారులకు సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సహాయం అందుతుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సానుకూలంగా స్పందించారని, నీరా పాలసీ మరియు పామ్ ఉత్పత్తుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.