Skip to content
Home » ప్రైవేట్ పాఠశాలల నుండి దరఖాస్తుల ఆహ్వానం: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన

ప్రైవేట్ పాఠశాలల నుండి దరఖాస్తుల ఆహ్వానం: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన

​సూర్యాపేట: జిల్లా పరిధిలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల నుండి జిల్లా కలెక్టర్ (షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ) కార్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ విద్యార్థులకు “బెస్ట్ అవైలబుల్ స్కూల్” పథకం కింద 1వ తరగతి (డే స్కాలర్) మరియు 5వ తరగతి (రెసిడెన్షియల్) ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలు కల్పించేందుకు పాఠశాలల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఈ పథకంలో భాగస్వాములు కావడానికి ఆసక్తి గల పాఠశాలలు వచ్చే నెల మార్చి 25వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

నిబంధనలు మరియు అర్హతలు

ఈ పథకానికి ఎంపికయ్యే పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన కఠిన నిబంధనలను కలిగి ఉండాలి. ముఖ్యంగా పాఠశాల ప్రారంభం నుండి ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండటంతో పాటు, గత ఐదేళ్లుగా 7వ మరియు 10వ తరగతి ఫలితాల్లో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అందులో కనీసం 50 శాతం మంది విద్యార్థులు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. వీటితో పాటు పాఠశాలల్లో అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాలు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇతర ముఖ్య అంశాలు

బోధనా సిబ్బంది ప్రభుత్వ నియమావళి ప్రకారం ఉండాలని, పాఠశాలకు సొంత భవనంతో పాటు ఆటస్థలం కూడా కలిగి ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. డే స్కాలర్ మరియు హాస్టల్ (బాలుర మరియు బాలికలకు వేరువేరుగా) సౌకర్యాలు ఉండాలి. ఆసక్తి గల యాజమాన్యాలు తమ పాఠశాల ఫీజుల వివరాలతో కూడిన దరఖాస్తులను గడువులోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వెల్లడించింది.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *