
హైదరాబాద్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను మరుగుజ్జు అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తమ సంఘం 25వ రజితోత్సవ వేడుకలకు సంబంధించిన వివరాలను మల్లన్నకు వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రజితోత్సవ ఆహ్వాన పత్రికను అందజేయగా ఆయన సాదరంగా స్వీకరించారు.

ఘనంగా రజితోత్సవ వేడుకలు:
మరుగుజ్జు అసోసియేషన్ 25వ రజితోత్సవ ఆత్మీయ సమ్మేళనం 2026 మార్చి 15వ తేదీన ఎల్బీ నగర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించనున్నారు. “మరుగుజ్జు గొప్పతనం – భవిష్యత్ ఆశయాలు” అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2000 మందికి పైగా సంఘం సభ్యులు హాజరవుతారని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి తీన్మార్ మల్లన్నను ముఖ్య అతిథిగా రావాలని కోరగా ఆయన తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.
బీసీల హక్కుల కోసం పోరాటం:
బీసీ సాధికారత కోసం నిరంతరం కృషి చేసే తీన్మార్ మల్లన్న మరుగుజ్జుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్యంగా మరుగుజ్జు సమాజానికి బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ పై మరియు విద్యార్థులకు అందుతున్న స్పాన్సర్షిప్ కార్యక్రమాలపై మల్లన్న ఆరా తీశారు. దేశంలోనే రెండో అతిపెద్ద మరుగుజ్జు జనాభా ఉన్న నగరంగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో వారి సామాజిక అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మల్లన్న భరోసా ఇచ్చారు.

ఆర్థిక సాయం అందజేత:
రజితోత్సవ వేడుకల నిర్వహణ కోసం తీన్మార్ మల్లన్న తక్షణమే రూ 20,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించి చెక్కును అందజేశారు. వారి ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మల్లన్న స్పష్టం చేశారు. ఈ భేటీలో మరుగుజ్జు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి మల్లేష్ మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.