
హైదరాబాద్, సూర్య న్యూస్ :తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ, 3,24,234 కోట్ల భారీ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. “తెలంగాణ రైజింగ్ 2050” లక్ష్యంతో రూపొందించిన ఈ బడ్జెట్లో సాగునీరు, విద్య, వైద్యం మరియు మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ప్రజా పాలనలో భాగంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించడం విశేషం.
వ్యవసాయం మరియు రైతు భరోసా
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ రంగానికి రూ, 28,450 కోట్లు కేటాయించారు. రైతు భరోసా పథకం కింద ఈ నెల 22న మొదటి విడతగా రూ, 3,590 కోట్లను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాగునీటి రంగానికి రూ, 16,320 కోట్లు కేటాయించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
విద్య, వైద్యం మరియు మహిళా సంక్షేమం
రాష్ట్రంలో విద్యా విప్లవానికి నాంది పలుకుతూ విద్యాశాఖకు రూ, 38,750 కోట్లు కేటాయించడం గమనార్హం. అలాగే ప్రజారోగ్యం కోసం రూ, 22,180 కోట్లు, మహిళా సంక్షేమం మరియు ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం రూ, 15,220 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ, 18,950 కోట్లు మరియు ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కూడా భారీగా నిధులు మళ్లించారు.
బడ్జెట్ ప్లస్లు : సంక్షేమ మేరునగం
రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందడం.
మహిళా సాధికారతకు మరియు ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేయడం.
ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణకు నిధుల కేటాయింపు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల.
బడ్జెట్ మైనస్లు : పెరుగుతున్న అప్పులు, పన్నుల భారం
రాష్ట్ర అప్పులు రూ, 5.5 లక్షల కోట్లకు చేరడం ఆందోళన కలిగిస్తోంది.
ఆదాయం పెంచుకునే క్రమంలో ఆస్తి పన్నును ఏకంగా 200% పెంచడం సామాన్యుడికి భారంగా మారింది.
హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఐటీ మరియు ఫార్మా రంగాలకు కేటాయింపులు తగ్గడం వల్ల పారిశ్రామిక వృద్ధి మందగించే అవకాశం ఉంది.
కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టత లేకపోవడం రైతులను ఇబ్బంది పెట్టే అంశం.
మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ సంక్షేమ పథకాలకు ఊతమిచ్చేలా ఉన్నప్పటికీ, పట్టణాభివృద్ధి మరియు పారిశ్రామిక ప్రగతిపై దృష్టి తగ్గించడం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ వ్యయం రూ, 2,38,000 కోట్లుగా ఉండగా, మూలధన వ్యయం కేవలం రూ, 42,500 కోట్లుగా ఉండటం గమనార్హం.
ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం మీ కోసం