Skip to content
Home » కష్టాలు.. కన్నీళ్లు.. కూల్చివేతలు.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన? బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ!

కష్టాలు.. కన్నీళ్లు.. కూల్చివేతలు.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన? బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ!

హైదరాబాద్, మార్చి 22 (సూర్య న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసపూరితమైనదని, తెలంగాణను తిరోగమనంలోకి నెట్టేసేలా ఉందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతదేశ చరిత్రలో ప్రజలను ఇంత దగాపూరితంగా మోసం చేసే బడ్జెట్‌ను తామెన్నడూ చూడలేదని ఆయన మండిపడ్డారు. శంభీపూర్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు అన్ని మోసమే

​ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు అన్ని అబద్ధపు హామీలేనని శంభీపూర్ క్రిష్ణ స్పష్టం చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలు, పేల్చివేతల పాలనగా మారింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందని, ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు మొండిచేయి: రైతు భరోసా 15 వేల రూపాయలకు పెంచుతామన్న హామీపై బడ్జెట్‌లో స్పష్టత లేదని విమర్శించారు.

మహిళలకు దగా: మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్న హామీ అమలు కాలేదని, తులం బంగారం పేరుతో పేద మహిళలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

యువతకు నిరాశ: రాజీవ్ యువ వికాసం పేరుతో రెండు లక్షల ఉద్యోగాల హామీని ప్రభుత్వం ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని క్రిష్ణ తెలిపారు.

పెన్షన్ల పెంపు లేదు: వృద్ధులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు.

ఇది ‘డొల్ల బడ్జెట్’.. ‘గోల్మాల్ బడ్జెట్’

​ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమేనని, ఇది ఒక ‘డొల్ల బడ్జెట్’, ‘గోల్మాల్ బడ్జెట్’ అని ఆయన అభివర్ణించారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలకు కేటాయింపులు లేవని, అవినీతి ప్రాజెక్టులకు మాత్రం భారీ నిధులు కేటాయించారని ఆరోపించారు.

ఉద్యోగులకు, కార్మికులకు తీవ్ర అన్యాయం: తుడుం పద్మారావు

​దుండిగల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు మాట్లాడుతూ, బడ్జెట్ ప్రసంగం మొత్తం అబద్ధాలు, మోసాలతో నిండి ఉందన్నారు. ఉద్యోగులకు పిఆర్సి, డిఏల గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం నిరాశపరిచిందన్నారు. టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దేశం అగ్రస్థానంలో నిలబెట్టామని, కానీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణను తిరోగమనంలోకి నెట్టేసారని విమర్శించారు.

హైదరాబాద్‌ను దోచుకునే ప్రయత్నం: అర్కల అనంతస్వామి​

మాజీ సర్పంచ్, మాజీ కౌన్సిలర్ అర్కల అనంతస్వామి ముదిరాజ్ మాట్లాడుతూ, హైదరాబాద్‌ను మూడు భాగాలుగా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తాగునీటి సమస్యపై ప్రస్తావన లేదని, కొత్త కార్పొరేషన్లకు నిధుల కేటాయింపులపై స్పష్టత లేదన్నారు.

ప్రజలే బుద్ధి చెబుతారు: శంకర్ నాయక్

​మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద మోసకారి అని, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో కూడా అతనికి తెలియదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రెస్ మీట్‌లో పాల్గొన్నవారు:

ఈ ప్రెస్ మీట్‌లో మాజీ కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, ఎల్లుగారి సత్యనారాయణ, జక్కుల శ్రీనివాస్ యాదవ్, కుంటి నాగరాజు, శంకర్ నాయక్, గోపాల్ రెడ్డి, భరత్ కుమార్, సుధాకర్ రెడ్డి, ప్యాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, మాజీ ఎంపీటీసీ మహేష్, నాయకులు శామీర్పేట్ రంగయ్య, ఈ శ్రీనివాస్, మాదాస్ నర్సింగ్ రావు, కుంట్ల నందు, మాదాస్ నవీన్, రంజిత్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, యువ నాయకులు విష్ణు, శ్రీకాంత్ యాదవ్, ప్రవీణ్ నాయక్, భాను, సద్దాం, మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.