
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశగా మరో అడుగు పడింది. అమెరికాలోని డెలావేర్ గవర్నర్ మ్యాట్ మేయర్, ఫస్ట్ లేడీ లారెన్ మేయర్లతో కూడిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు.
విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలపై చర్చ
ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూర్చేలా డెలావేర్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ మద్దతు, రుణ ఉపశమన పథకాల గురించి గవర్నర్ మేయర్ వివరించారు. అందరికీ నాణ్యమైన వైద్యం అందించే ‘యూనివర్సల్ హెల్త్కేర్’ ప్రాధాన్యతను ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణలో చేపడుతున్న విద్యా, వైద్య రంగ సంస్కరణలకు డెలావేర్ అనుభవాలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్ అందజేత
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్’ను ముఖ్యమంత్రి గవర్నర్ మేయర్కు అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. డెలావేర్ సందర్శనకు రావాలని గవర్నర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.