
పటాన్చెరు, సూర్య న్యూస్ : పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు మరియు మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు, అలాగే పవిత్ర రంజాన్ మాసం ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని తెలుపుతూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దూరదృష్టి నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, ప్రజల సంక్షేమం కోసం గత ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు, అలాగే నియోజకవర్గ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని, కేసీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని స్పష్టం చేశారు.
ఈ భారీ కార్యక్రమంలో స్థానిక నాయకులు సోమి రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, ఎర్రోళ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తొంట అంజయ్య, గడిల శ్రీకాంత్, తెలంగాణ ఉద్యమ నాయకుడు వెంకటేష్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.