Skip to content
Home » ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన.. కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రి అట్టహాసంగా ప్రారంభం

ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన.. కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రి అట్టహాసంగా ప్రారంభం

హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్‌లోని కోకాపేటలో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వైద్యం కేవలం యాంత్రికంగా ఉండకూడదని, ప్రజలకు మానవత్వంతో కూడిన సాయం అందించడం ప్రతి వైద్యుడి ప్రాథమిక కర్తవ్యంగా భావించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా లేదా 50 శాతం రాయితీతో రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఆడబిడ్డల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. గత 20 ఏళ్ల ఆరోగ్యశ్రీ డేటాను విశ్లేషించి రాష్ట్రంలోని 65 లక్షల మందికి ప్రత్యేక హెల్త్ డేటాను తయారు చేస్తున్నామని, వారికి త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని ముఖ్యమంత్రి వివరించారు.

రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ మరియు చికిత్సపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించామని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద ప్రజల వైద్యం కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఉస్మానియా, టిమ్స్ ఆసుపత్రుల నూతన నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసం 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వైద్యులు కూడా సామాజిక బాధ్యతగా ఏడాదిలో కనీసం ఒక నెల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ సేవలు అందించాలని ఆయన ఒక ఆసక్తికరమైన సూచన చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *