
హైదరాబాద్, సూర్య న్యూస్ : ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి గుండా సాగే వాణిజ్య రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచ చమురు, నేచురల్ గ్యాస్ సరఫరాలో 20 శాతం వాటా కలిగిన ఈ కీలక మార్గంలో దాడుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ 97 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ 100 డాలర్ల మార్కును తాకాయి. దీనితో రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోల్ ధర లీటరుకు 130 రూపాయలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిత్యావసర వస్తువుల చట్టం కింద ‘నేచురల్ గ్యాస్ సప్లై రెగ్యులేషన్ ఆర్డర్ 2026’ను జారీ చేసింది. దీని ద్వారా గృహాలకు వాడే పైప్డ్ గ్యాస్, సీఎన్జీకి పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నారు. పరిశ్రమలకు గ్యాస్ కోత విధించి, ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి ఎల్ఎన్జీ కార్గోలను రప్పిస్తున్నారు. ఇప్పటికే రెండు ఎల్ఎన్జీ కార్గోలు సురక్షితంగా భారత్ వైపు వస్తున్నాయి.
ఇంధన సంక్షోభ ప్రభావం తెలంగాణపై పడకుండా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కార్యాలయం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణను ప్రారంభించింది. హైదరాబాద్లో సీఎన్జీ స్టేషన్లు సాధారణంగానే పనిచేస్తున్నాయని, వంటగ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. ఫర్టిలైజర్, పవర్ ప్లాంట్లకు ప్రాధాన్యత ఆధారంగా గ్యాస్ కేటాయింపులు జరుగుతున్నాయి.