
కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ : మతాలకు అతీతంగా అందరూ సామరస్యంగా పండుగలను జరుపుకోవాలనే గొప్ప సందేశంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ పరిధిలోని మల్లంపేట్లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఈ విందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శంభీపూర్ క్రిష్ణ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మరియు దానధర్మాలతో గడిపే ఈ నెల మతసామరస్యానికి నిదర్శనమని కొనియాడారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, అందరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకోవడం వల్ల సమాజంలో ఐక్యత పెరుగుతుందని ఆయన తెలిపారు. మైనారిటీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, షామీర్ పేట్ హనుమంత్ రావు, విష్ణు వర్ధన్ రెడ్డి మరియు దుండిగల్ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ షామీర్ పేట్ రంగయ్య పాల్గొన్నారు. వారితో పాటు నాయకులు ఉస్మాన్, మల్లేష్, అనిల్ రెడ్డి మరియు మైనారిటీ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం స్థానికంగా మతసామరస్యానికి మరియు పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచింది.