
Hyderabad, Surya News:తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్థాపించిన కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్ (Medchal) లోని అద్వయ కన్వెన్షన్లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీ పేరును తెలగాణ రాష్ట్ర సేన గా ప్రకటించారు. అయితే ఇవాళ ఈసీ అనూహ్యంగా తెలంగాణ రక్షణ సేన పేరును ఖరారు చేసింది. దీనిపై స్పందించిన కవిత సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రక్షణ సేన అనగా టీఆర్ఎస్ (TRS) కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ కోసం తాను చేసిన కృషిని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని కవిత (Kavitha) తెలియజేశారు. జనవరి 2026 లో జాతీయ ఎన్నికల సంఘం (ECI) నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని ఆమె వివరించారు.
తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లతో రాజకీయ పార్టీ (Political Party) ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరారు. అందులో మూడవ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని కవిత అన్నారు. టీఆర్ఎస్ (TRS) పేరు తనకు రాసిపెట్టి ఉందేమో అని ఆమె అభిప్రాయపడ్డారు. అప్లికేషన్ లో మూడో పేరుగా పెట్టిన తెలంగాణ రక్షణ సేన (TRS) కు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విధి కవిత వైపు నిలిచి టీఆర్ఎస్ పేరును మళ్లీ ఆమెకు దక్కేలా చేసిందని వారు సంతోషం వ్యక్తం చేశారు.